- ప్రతీ కుటుంబానికి సంక్షేమం అందాలి
- రోడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలి
- జలహారతి పనులను మ్యాపింగ్ చేయాలి
- ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి:- అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్దిని ఉపయోగించుకుని పేద, మధ్య తరగతి కుటుంబాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నామని సీఎం వెల్లడించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”అభివృద్ధి-సంక్షేమం అనేది సమపాళ్లల్లో అందిస్తూ పాలన చేస్తున్నాం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాల్సిందే. ఈ మేరకు ఫ్యామ్లీ బెనిఫిట్ కార్డులను రూపొందిస్తున్నాం. అన్న క్యాంటీన్లల్లో నిత్యం తనిఖీలు చేస్తూనే ఉండాలి. ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా చూసుకోవాలి. పేదలు సంతృప్తిగా భోజనం చేసేలా ఏర్పాట్లు చేశాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు డబ్బు ఆదా అవుతోంది.. మూడు పూటలా కడుపు నిండా ఆహారాన్ని అందిస్తున్నాం. మహిళలపై నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించవద్దు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలి. తప్పు చేయాలంటే నేరస్తులు భయపడేలా ఉండాలి. ఆ పరిస్థితి వచ్చేలా పోలీసింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్యానెళ్లు ఏర్పాటు చేయాలి. దీన్ని తప్పకుండా ఆచరించేలా చూడాలి. ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయంలో ఆధునిక పద్దతులను అవలభించేలా రైతుల్లో మరింత అహగాహన కల్పించాలి. వ్యవసాయంలో రీసెర్చ్ వర్క్ మరింత పెంచాలి. ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించడంతోపాటు… ఉద్యాన పంటల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలి. అలాగే ఏయే పంటలు వేసుకోవాలనే అంశం మీద రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం స్పష్టం చేశారు.
‘టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కు అధికారులు ప్రాధాన్యమివ్వాలి..
‘జలధార-జలహారతి పనులను మరింత వేగవంతం చేయాలి. జరుగుతున్న పనులను మ్యాపింగ్ చేసుకోవాలి. జలధార పనులను కాస్ట్ ఎఫెక్టివ్ తరహాలో చేపట్టాలి. నీటి భద్రత అనేది ప్రభుత్వ ప్రాధాన్యాతంశాల్లో ఒకటిగా ఉంది. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. నిధులు కూడా ఇస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ఉండే రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. సమాచారం తెప్పించుకోవాలి. కొన్ని జిల్లాల్లో బస్సులకు సీసీ కెమెరాలు పెట్టి రోడ్ల పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అదే తరహాలో వినూత్నంగా క్షేత్ర స్థాయి నుంచి ఆ సమాచారాన్ని ఎలా రప్పించుకోవాలనే ఆలోచన చేయాలి. పాత్ హోల్స్ సమస్య ఉండకూడదు. ప్రపంచంలోని ప్రతి లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలి. అమరావతికి ఈ టెక్నాలజీలను తీసుకువస్తే… ఇక్కడ యువతకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఐటీలో భారతీయులు, తెలుగు వాళ్లు ప్రపంచంలోనే ఛాంపియన్లుగా నిలిచారు. అలాగే కొత్త రకం టెక్నాలజీల విషయంలోనూ మనమే ముందుండాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పరంగా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేపట్టేలా ఎకో సిస్టంను అభివృద్ధి చేయాలి. పరిపాలనలో ప్రిడెక్టివ్ అడ్వాన్సుడ్ ప్లానింగ్ ఉండాలి. డేటా డ్రివెన్ నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మేరకు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.