LAND RECORDS: రైతుల చేతికే భూముల డిజిటల్ లాకింగ్

  • భూ రికార్డుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత
  • రైతుల చేతికే భూముల డిజిటల్ లాకింగ్
  • రెండేళ్లకే అసైన్డ్ ఇళ్ల పట్టాలపై సర్వ హక్కులు
  • సింగపూర్ పాలనా విధానాల అనుసరణతో ఉత్తమ రాష్ర్టంగా ఏపీ
  • కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రసంగం
revenue lands digital locking system minister anagani satya prasad
అమరావతి: గత ప్రభుత్వం విధ్వంస పాలన నుండి రెండేళ్లలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టరల్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. సూపర్ సిక్సకు మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రెవెన్యూ వ్యవస్థలోనూ ఈ రెండేళ్లలో సమూల సంస్కరణలు తెచ్చామన్నారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి అస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కెవైసీ సదుపాయం కల్పించామన్నారు. పట్టా భూముల 1బి, అడంగల్ ను అన్లైన్లో భూ యజమానులే స్వంతంగా లాక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. భూయజమానుల అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యుటేషన్లు గానీ, రిజిస్ట్రేషన్లు గానీ చేసే అవకాశం ఉండదన్నారు. కొత్త పాస్ బుక్ కూడా ఈకేవైసీ చేసి డ్రాఫ్ట్ పాస్ పుస్తకాన్ని రైతులకు చూపించి వారు సంతృప్తి చెందిన తర్వాతే ముద్రణకు పంపిస్తున్నామన్నారు. పేదలకు అసైన్ చేసిన ఇళ్ల పట్టాలకు గతంలో పదేళ్ల తర్వాత సర్వ హక్కులు కల్పిస్తే కూటమి ప్రభుత్వం రెండేళ్ల తర్వాత సర్వ హక్కులు కల్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని వల్ల బడుగు కుటుంబాలకు ఆర్ధిక భరోసా దోరుకుతుందన్నారు. పట్టణ గరిష్ఠ భూ పరిమితి చట్టం కింద నిషేధ జాబితాలో ఉన్న స్థలాల క్రమబద్దీకరణ గడువు తేదీని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. క్రమబద్దీకరణ ప్రక్రియను కూడా సులభతరం చేశామని, గతంలో ప్రభుత్వం వద్దకు రావాల్సి ఉండగా ప్రస్తుతం సీసీఎల్ఎదే స్థాయిలోనే ఆదేశాలు ఇచ్చే విధంగా సవరణ చేశామన్నారు. విలేజ్ సర్వీసు ఇనాం భూములను 22ఎ నిషేధిత జాబితా నుండి తొలగిస్తూ 1.36 లక్షల ఎకరాలకు విముక్తి కల్పించామన్నారు. రాష్ట్రంలో 33,440 ఎకరాల షరతుల గల పట్టా భూములు ఉండగా 33,012 ఎకరాల భూములపై కూడా రైతులకు పూర్తి హక్కులు కల్పించామన్నారు. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసిన భూములను రద్దు పరిచే అధికారాన్ని కలెక్టర్లు సక్రమంగా అమలు చేయాలన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ డిపార్టమెంట్లను అనుసంధానించి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూమి రికార్డులకు అత్యున్నత భద్రత కల్పిస్తున్నామన్నారు. కలెక్టర్లంతా ప్రభుత్వ ఆశయాలు, ఉద్దేశ్యాలను మరింత లోతుగా అర్ధం చేసుకొని చిత్తశుద్దితో పని చేయాలన్నారు.

సింగపూర్ పర్యటన లో ఎంతో నేర్చుకున్నాం..

వారం రోజుల పాటు సాగిన సింగపూర్ పర్యటనలో పాలనకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గతంలో ఎన్నో సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పటికీ ఈ పర్యటన మాత్రం చాలా ప్రత్యేకమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో భారీ వ్యవస్థ ఉండగా సింగపూర్ తన పనులను చాలా ఖచ్చితంగా, సమన్వయంతో చేయడంలో మేటి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తనకున్న విస్తృతమైన వ్యవస్థను, సింగపూర్ లాంటి ఖచ్చితత్వంతో కలిపి ముందుకు తీసుకెళ్లాలన్నారు. మనం 500 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నప్పటికీ సింగపూర్ లాగా వాటన్నింటినీ ఒకే చోట, సులభంగా అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బలమైన వ్యవస్థలైన ఆర్టీజీఎస్, మీ భూమి, సింగిల్ డెస్క్ వంటి ఉండగా, వాటినకి సింగపూర్ మాదిరి ఒకదానితో ఒకటి అనుసంధానించి పని చేయించాలన్నారు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నప్పటికీ సింగపూర్ ప్రభుత్వం మాదిరి పరిశ్రమలు రాక ముందే భూమిని, మౌళిక వసతులను సిద్దం చేసి ఉంచేలా చూడాలన్నారు. ఏపీలో ప్రభుత్వ శాఖలు, జిల్లా పరిపాలన పటష్టంగా ఉన్నప్పటికీ సింగపూర్ లాగా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేసేలా చూసుకోవాలన్నారు. ఇప్పటికే ఏపీ దేశంలో ఉత్తమ విధానాలను అనుసరిస్తూ ఉండగా సింగపూర్ విధానాలను కూడా మేళవింపు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మారుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments