Volunteer: వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక జీవోలు లేవు
Volunteer: వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక జీవోలు లేవు
• వాలంటీర్ల పేరుతో గత పాలకులు వంచించారు
• ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ యువతను మోసం చేశారు
• వాలంటీర్లకు గతంలో ఇచ్చిన హామీపై క్యాబినెట్ లో పలుమార్లు చర్చించాం
• ఏజెన్సీ ప్రాంతంలో ఉమ్మడి సేంద్రీయ వ్యవసాయం పెరగాలి
• కేరళ తరహా పర్యాటకం మన దగ్గర అధికమవ్వాలి
• ఏజెన్సీ రెండు రోజుల పర్యటనలో భాగంగా కురిడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
వాలంటీర్లకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వేతనాలు పెంచడంపై మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చర్చించాం. అయితే వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. సరైన ఉత్తర్వు పత్రాలను, జీతభత్యాలను లేకుండానే వారిని నియమించింది. గౌరవ వేతనాలు విచిత్రంగా ఎక్కడ నుంచి అందించిందో కూడా తెలియని పరిస్థితి కనిపించింది. నేను ఈ విషయంపై చర్చకు తీసుకురాగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గౌరవ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలన చేసి వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక నియామకాలు జరగలేదని గుర్తించారు. వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం వారిని నిలువునా వంచించిందని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాలంటీర్లను సేవ చేయడానికి తీసుకొని గౌరవ వేతనాల పేరుతో అనధికారిక చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోందన్నారు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి, పూర్తిగా వారు ఏ కోవలోకి చెందకుండా పని చేయించుకున్నారని స్పష్టం చేశారు. అసలు జీతాలు ఎక్కడ నుంచి వచ్చాయో వాలంటీర్లు అంతా సంఘ నాయకులను ప్రశ్నించాలని, విచిత్రమైన అకౌంటింగ్ తో యువతను నిలువునా మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. యువత జీవితాలు బాగుండాలని కలలు కనే వ్యక్తినని, వాలంటీర్లను ఆదుకునే విషయంలో సరైన దారి వెతుకుతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అల్లూరి సీతా రామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కురుడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు చెప్పిన సమస్యలు అసాంతం విన్నారు. వాటిని రాసుకున్నారు. అనంతరం సమస్యలపై అధికారులకు తగు సూచనలు చేసి పరిష్కార మార్గాలు వెతకాలని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు యువత వాలంటీర్ల సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "వాలంటీర్ అనే పేరును వైసీపీ ప్రభుత్వం అతి తెలివితో పెట్టింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారు అని అర్థం. కానీ ప్రచారం మాత్రం ప్రభుత్వ ఉద్యోగమని మభ్యపెట్టి యువతను మోసం చేశారు. కనీసం వారికి ఎక్కడ నుంచి జీతాలు ఇచ్చారో కూడా ఆర్థిక శాఖ వద్ద నివేదిక లేదు. యువతను పూర్తిగా వంచించి వైసీపీ పబ్బం గడుపుకొంది.
ఏజెన్సీలో వైసీపీ కనీసం 100 కిలోమీటర్ల రోడ్లు వేయలేదు
కూటమి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాల్లో రూ. వెయ్యి కోట్ల ఖర్చుతో రోడ్లను నిర్మిస్తోంది. ప్రస్తుతం రూ. 400 కోట్లు ఖర్చు చేశాం. మరో రెండు మూడు నెలల్లో రూ. 600 కోట్లు రోడ్ల నిర్మాణం నిమిత్తం ఖర్చు చేయబోతున్నాం. వైసీపీ తన ఐదేళ్ల పాలన కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో కనీసం వంద కిలోమీటర్ల రోడ్లను వేయలేకపోయింది. మొత్తం వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. ఎవరికి ప్రశాంతత లేకుండా పరిపాలించారు. వాలంటీర్ల దగ్గర నుంచి ప్రజలను, వ్యవస్థలను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే సమయం సరిపోతోంది. నాకు తెలిసినంత వరకు మద్యంలో రూ. 25 వేల కోట్ల అవినీతి జరిగింది. దొరికినకాడికి దొరికినట్టుగా దోచేశారు.
పోషకాహార లోపంపై దృష్టి సారిస్తాం
ఏజెన్సీ గ్రామాల్లో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి బాధితులు అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. జన్యు లోపాలు, ఇతర కారణాలతో పుట్టే పిల్లలకు పోషకాహార లోపం ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. దీనిని అధిగమించడానికి దృష్టి సారిస్తాం. మెరుగైన పోషక పదార్ధాలు పిలల్లకు అందించేందుకు అంగన్వాడీలతో అనుసంధానం చేసి ప్రత్యేక పోషక పదార్ధాలు అందేలా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడతాను. పాడేరులో కూడా గర్భిణీలకు సంబంధించి ఆసుపత్రిలో సరైన వసతులు లేవని నా దృష్టికి వచ్చింది. స్కానింగ్ పనిచేయడం లేదని, రేడియోలజిస్ట్ లేరని తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను.
ఉమ్మడి వ్యవసాయంపై దృష్టి సారించాను
ఉద్యోగ అవకాశాలు కావాలని యువత కోరుతున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. పనిచేయాలన్న బలమైన తపన ఉన్న వారికి సరైన ఉపాధి, ఉద్యోగం చూపించాలన్నది కూటమి ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉమ్మడి వ్యవసాయం మెరుగైన ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ ఉండే భూమిని ఉపయోగించుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కురిడి గ్రామంలో 400 ఎకరాలకుపైగా భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటి భూమిలో ఔషధ మొక్కలు, పండ్లు, పూల పంటలు వేస్తే అధికంగా ఆదాయం వస్తుంది. పని చేయకుండా డబ్బులు రావాలంటే ఈ రోజుల్లో కుదిరే పని కాదు. ఉపాధి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ తెగల పెద్దలంతా కలిసి ఓ ఒప్పందానికి వచ్చి ఉమ్మడి వ్యవసాయం చేస్తే మంచి ఆదాయం వస్తుంది. యువతకు సరైన ఉపాధి దొరుకుతుంది.
కురిడి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేద్దాం
ఏజెన్సీలో 2.5 లక్షల ఎకరాల భూమిలో కాఫీ పంట వేస్తున్నామన్నారు. మరో లక్ష ఎకరాల కాఫీ పంట సాగు చేసేందుకు జిల్లా కలెక్టర్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అనుమతి కల్పించాలని కోరారు. పది సెంట్ల భూమి ఉంటే పంచాయతీరాజ్ పరిధిలో నరేగా నిధులు నుంచి నిధులు ఇచ్చి, దాని నుంచి ఆదాయం పొందే మార్గాలను మేము చూపిస్తాం. మన ఇంటి పెరట్లో సాగు చేసుకునే విధంగా, శ్రద్ధగా పంటలను వేస్తే మంచి ఆదాయం లభిస్తుంది. దీనికి అన్ని విధాల నేను సహకరిస్తాను. మరోసారి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను నుంచి అధికారులను పంపించి సాగు పద్ధతులు గురించి మీకు వివరించే ఏర్పాట్లు చేస్తాను. మొదటగా కురిడి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేసి ప్రయోగాత్మకంగా ఉమ్మడి సాగు గ్రామంగా తీర్చిదిద్దుదాం. మీరు వేసే పంటలు మార్కెట్ కు వెళ్లేలా విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. కురిడి గ్రామం నా ప్రస్థానానికి దారి చూపించిన గ్రామం. కాబట్టే గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చాను. కురిడి గ్రామ అభివృద్ధికి నా సొంత నిధుల నుంచి రూ. 5 లక్షలు ప్రకటిస్తున్నాను. గ్రామంలో ఇతర సమస్యలను కూడా ప్రాధాన్య క్రమంలో పరిష్కరించుకుందాం. నాకు కాస్త సమయం ఇవ్వండి.
సాంస్కృతిక పర్యాటకం పెంచుదాం..
సినిమా, టీవీ సీరియల్స్ రూపొందించే వారికి ఉపయోగపడేలా వసతులు ఏర్పాటు చేయాలి. హోం స్టేలను ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల ఆదాయం, అభివృద్ధి రెండూ జరుగుతాయి. సినిమా షూటింగ్ ల సమయంలో స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. టూరిజం శాఖ నుంచి పక్కా ప్రణాళికతో ఇక్కడ అభివృద్ధి, షూటింగులు పెంచేలా చర్యలు తీసుకుంటాం. స్థానికంగా ఉండే భాషలు, సంప్రదాయాలు విరాజిల్లేలా పర్యటకం అభివృద్ధి చెందాలి. దీనివల్ల స్థానిక యువత ఉపాధి పొందాలి. పర్యటకం అభివృద్ధి చెందే సమయంలో ప్రకృతికి ఏ మాత్రం విఘాతం కలగకూడదు. ప్రకృతి అందాలు మరింత పెంచేలా నిర్మాణాలు ఉండాలి. పర్యావరణం రక్షించే అభివృద్ధి ప్రస్థానం అన్నింటా అవసరం. సిమెంట్ నిర్మాణాలు ఇష్టానుసారం చేపట్టడం వల్ల సహజ సిద్ధమైన అందాలు మాయమవుతాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించి ఏజెన్సీ ప్రాంతంలో ఏ మాత్రం విధ్వంసం లేకుండా ముందుకు వెళ్లాలి.
కేరళ తరహాలో ప్రత్యేక అభివృద్ధి
కేరళ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే ప్రత్యేక గ్రామ దేవతల ఉత్సవాలకు విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు. వారి సంస్కృతిని ప్రతిబింబిస్తూ నమ్మిన దేవతలకు మనస్ఫూర్తిగా ఉత్సవం చేసే కార్యక్రమాన్ని అంతా కలిసి పండగలా చేస్తారు. అలాంటి సాంస్కృతిక టూరిజం మన ఏజెన్సీ ప్రాంతంలోనూ రావాలి. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకుంటూ ఉత్సవాలను నిర్వహించుకునే పర్యాటకం పెరగాలి. కుల ధ్రువీకరణ పత్రాలు కోసం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. ఈ రోజు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాను. వ్యసనాలు, గంజాయి వద్దు. గంజాయి కంటే తులసి, మారేడు మొక్కలు నాటడం మంచిది.
మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు సమస్యలు ఉంటే వాటిని తీర్చడానికి మేము పని చేస్తాం. తప్పు జరిగినప్పుడు మాట పడటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. నాకు మొదట నుంచి ప్రకృతి అంటే ప్రేమ, అడవి అంటే అభిమానం. నేను గిరిజనుడుగా పుట్టలేదు కానీ నాలో గిరిజన మనస్తత్వం ఉంది. అడవి బిడ్డల ఆక్రందన, వేదన నా మనసుకు ఎప్పుడు తాకుతూనే ఉంటాయి. వారి కష్టం నా కష్టం అనుకుంటాను. అడవి బిడ్డల ప్రేమ, అభిమానం నా మనసుకు ఎప్పుడూ తాకుతూనే ఉంటుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ ఎస్.దొన్ను దొర, జనసేన నాయకులు వంపూరు గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.