Railway Scam: భార్యాభర్తల గొడవతో రైల్వేలో కుంభకోణం బట్టబయలు.!
Railway Scam: భార్యాభర్తల గొడవతో రైల్వేలో కుంభకోణం బట్టబయలు.!
• రైల్వే గార్డు ద్వారా భార్య కోసం ఉద్యోగ ప్రయత్నం..
• రూ. 15 లక్షలు తీసుకుని వేరే అమ్మాయితో పరీక్ష రాయించిన ఏజెంట్..
• ‘పాయింట్స్ విమెన్’గా ఉద్యోగం సాధించిన మహిళ..
• ఉద్యోగం వచ్చాక భర్తతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్న భార్య..
• ఆమెపై కోపంతో రైల్వే అధికారుల వద్దకు వెళ్లి భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన భర్త..
• రంగంలోకి దిగిన సీబీఐ..
• రాజస్థాన్లోని కోటాలో ఘటన..
రైల్వే ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో రూ. 15 లక్షలు ఖర్చు చేసి మరీ భార్యకు రైల్వేలో ఉద్యోగం ‘కొన్నాడు’. అయితే, మనస్పర్థల కారణంగా విడిపోవడంతో భార్యపై కోపంతో ఈ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాజస్థాన్లోని కోటాకు చెందిన మనీశ్ మీనా 8 నెలల క్రితం రైల్వే అధికారులను కలిశాడు. తన భార్య డమ్మీ అభ్యర్థి ద్వారా రైల్వే ఉద్యోగం సాధించిందని, ఇందుకోసం తాను రూ. 15 లక్షలకు పొలాన్ని తాకట్టు పెట్టానని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. రైల్వే గార్డు అయిన రాజేంద్ర అనే ఏజెంట్ ద్వారా రూ. 15 లక్షలు చెల్లించి డమ్మీ అభ్యర్థితో పరీక్ష రాయించినట్టు చెప్పాడు. ఈ డబ్బు కోసం తన పొలాన్ని తాకట్టు పెట్టినట్టు వివరించాడు.
ప్రైవేటు రైల్వే ఉద్యోగి అయిన మనీశ్ 2022లో ఆశా మీనాను వివాహం చేసుకున్నాడు. మంచి భవిష్యత్తు కోసం ఆశా బంధువు ద్వారా రైల్వే గార్డును కలిశాడు. జబల్పూర్లోని సీనియర్ రైల్వే అధికారి పేరుతో గార్డు రూ. 15 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఆశా మీనాకు బదులుగా లక్ష్మీ మీనా అనే మహిళ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ రాసి పాసైంది. అనంతరం పశ్చిమ మధ్య రైల్వే (డబ్ల్యూసీఆర్)లో పాయింట్స్ విమెన్గా ఉద్యోగం సంపాదించింది.
పలువురు అభ్యర్థుల పేరుతో లక్ష్మీ మీనా పరీక్షలు రాస్తున్నట్టు 2024లో అధికారులు గుర్తించారు. ఆమె ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. కాగా, ఉద్యోగం సంపాదించిన తర్వాత భర్తతో ఆశాకు విభేదాలు మొదలయ్యాయి. అతడికి ఉద్యోగం లేదన్న కారణంతో భర్తను విడిచిపెట్టింది. అంతేకాదు, మనీశ్ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపించింది. ఈ నేపథ్యంలో భార్యపై కోపం పెంచుకున్న మనీశ్.. రైల్వే అధికారులను కలిసి ఆమె ఉద్యోగం ఎలా సంపాదించిందీ గుట్టు విప్పాడు. విషయం బయటకు రావడంతో గత శుక్రవారం కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.