రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Republic Day: రిపబ్లిక్ డే జనవరి 26నే ఎందుకు జరుపుతారు? ఈ రోజుకు ఎందుకు అంత ప్రత్యేకత?

REPUBLIC DAY 2025 Republic Day Special Story Republic Day quotes First Republic Day Republic Day speech Republic day importance Republic day news
Peoples Motivation

Republic Day: రిపబ్లిక్ డే జనవరి 26నే ఎందుకు జరుపుతారు? ఈ రోజుకు ఎందుకు అంత ప్రత్యేకత?

జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు?

భారతదేశ చరిత్రలో ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి?

REPUBLIC DAY 2025 Republic Day Special Story Republic Day quotes First Republic Day Republic Day speech Republic day importance Republic day news

Republic Day: ఏడాదికోసారి వేడుకలు జరుపుకొని మర్చిపోవడం కాదు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటున్నాం? రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు ఏంటి? బాధ్యతలు ఏంటి? అనే విషయాలు కూడా అందరూ తెలుసుకోవాలి. హక్కలు కోసం పోరాడడం మాత్రమే కాదు బాధ్యతలు కూడా విస్మరించకూడదు. ఈ దేశం నాకు ఏమీ ఇవ్వలేదని పరాయి దేశాలకు పారిపోవడం కాదు. ఈ దేశం కోసం మనమేం చేయగలమో చేసి చూపించాలి. అప్పుడే భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది.

దాదాపు 2 శతాబ్దాలకుపైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. వ్యాపారం కోసం దేశంలోకి ప్రవేశించి, వనరులు దోచుకోడానికి నిశ్చయించుకొని, దేశంలోని అనైక్యతను ఆసరాగా తీసుకొని ఆంగ్లేయులు భారతదేశంపై పట్టు సాధించారు. 'విభజించు పాలించు' అనే విధానం అవలంభించి దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా, 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే. ఈ స్టోరీలో భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతను తెలుసుకుందాం..


ఈ తరానికి తెలుసా?

గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏంటని ఈ తరం వారిని అడిగితే వారికి ఈ రోజు ఒక పబ్లిక్ హాలిడే. కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడిపే ఒక సెలవు రోజు. అంతకు మించి వారికేమి తెలియదు. ఈ జాతీయ సెలవు రోజున ఎంత మంది స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటారంటే సమాధానం ఉండదు. దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది? అని ప్రశ్నిస్తే 'నో ఆన్సర్!'


రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి?

-Advertisement-

అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. కానీ, దీని వెనుక బలమైన కారణం ఉంది. అదేమిటో చూద్దాం..


జలియన్‌ వాలాబాగ్ ఉదంతం తరువాత..

వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు. జలియన్‌ వాలాబాగ్ ఉదంతం తరువాత ఒక్కసారిగా కళ్లు తెరచిన భారత నేతలు లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డు తీరాన త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా, మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు.


భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దు..

జనవరి 26, 1950తో బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌‌ను ఎన్నికోగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్‌ అంబేడ్కర్‌ను నియమించారు. 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది.


అప్పటి నుంచి అమల్లోకి భారత రాజ్యాంగం

బ్రిటీష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఆనాటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. విదేశీ పాలన పూర్తిగా అంతరించి స్వదేశీయుల చేతిలోకి భారత దేశం వచ్చిన శుభ సందర్భంగా ప్రతి ఏటా రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్లో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొంటాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరుల సమక్షంలో రాష్ట్రాలు సాధించిన అభివృద్ధిని తెలియజేసే శకటాలు ఈ పరేడ్లో పాల్గొంటాయి.


దేశమంతా పండగే

రిపబ్లిక్ డే రోజు నగరాలు మొదలుకొని గ్రామాల వరకు, పార్లమెంటు నుంచి పంచాయితీ కార్యాలయం వరకు ఊరూరా, వాడవాడలా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరుగుతాయి.

ముఖ్యంగా యువత ఈ బృహత్తరమైన బాధ్యత స్వీకరించాలి. ఈ దేశమేగినా ఎందు కాలిడినా భరతమాత ముద్దు బిడ్డలమని మరువకూడదు. మన దేశం కోసం ఎలాంటి త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉండాలి. జననీ జన్మ భూమిశ్చ! స్వర్గాదపి గరీయసి! అన్నట్లు కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు. జైహింద్!

Comments