లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై...
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై...
హైదరాబాద్, ఏప్రిల్ 06 (పీపుల్స్ మోటివేషన్):-
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం (ఏప్రిల్ 6) ఏసీబీ దాడులు నిర్వహించింది. లంచం తీసుకుంటూ మాదాపూర్ ఎస్సై రంజిత్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఈ కేసులో స్టేషన్ రైటర్ విక్రమ్ ను కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్ సాయినగర్ లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే, తన స్థలంలో ఇల్లు కడుతున్నాడంటూ ఆయనపై సుధ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రంజిత్.. ఆయన్ని పోలీస్ స్టేషన్లకు రావాలని ఫోన్ చేశారు. రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన స్థలంలో ఇల్లు కట్టుకుంటే డబ్బులెందుకు ఇవ్వాలని లక్ష్మణ్ ఎదురు ప్రశ్నించారు. ఇవ్వకపోతే.. కూతురు, అల్లుడిపై కేసు నమోదు చేస్తామని ఆయన్ని బెదిరించారు. రూ.20 వేలు మాత్రమే ఇస్తానని చెప్పిన లక్ష్మణ్.. ఇదే విషయంపై అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ సిబ్బందిపై నిఘా ఉంచిన అవినీతి నిరోధక శాఖ... లక్ష్మణ్ రూ.20 వేల రూపాయలు డబ్బులిస్తుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.