రాజకీయ నాయకులకు ముచ్చమటలు
రాజకీయ నాయకులకు ముచ్చమటలు
హైదరాబాద్, ఏప్రిల్ 04 (పీపుల్స్ మోటివేషన్):-
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయం కావడంతో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా భయపడుతున్నారు. ఈ ఎండాకాలం బయటపడేదెలా అని ఆలోచిస్తున్నారు. ప్రచారానికి వేకువ జామునే వెళుతున్నా మధ్యాహ్నం అయితే గానీ రావడం కుదరడం లేదు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. వడ గాల్పుల తీవ్రత పెరిగింది. మరో నాలుగు రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతవారణ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకూ చిన్న పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి ఆరుబయట పంట పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు వేడిగాలుల కారణంగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యవసాయ పనులు ఉదయం 11లోపు ముగించాలని, అదేవిధంగా తిరిగి సాయంత్రం మూడుతర్వాత కొనసాగించుకోవచ్చని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా నిడమనూర్లో అత్యధికంగా 43.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతవరణం నెలకొంది. టీక్యాతాండా, ధరూర్లో 43.4, పెబ్బేర్లో 43.3, నాంపల్లిలో 43.2, కొరటపల్లి, బుగ్గబావిగూడ, తిరుమలగిరి కేంద్రాల్లో 43.1, వడ్డేపల్లిలో 43,కోనైపల్లి , ఇబ్రహింపట్నం, 42.9డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయిలో గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల నాలుగు రో జుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాగల 24గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 39డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.