ఫుడ్ కలర్ ఆహార పదార్థాలపై నిషేధం..అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష
ఫుడ్ కలర్ ఆహార పదార్థాలపై నిషేధం..అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష
పలు రాష్ట్రాల్లో పీచు మిఠాయిలపై నిషేధం ఆ దిశగా కర్ణాటక...
కృత్రిమ రంగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి...
ఫుడ్ కలర్ వాడిన వంటకాలు అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష...
ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న కారణంతో ప్రభుత్వాల నిర్ణయం
కృత్రిమ ఆహార పదార్థాలపై తాజాగా నిషేధాజ్ఞలు జారీ..
బెంగళూరు, (పీపుల్స్ మోటివేషన్):-
పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని(కాటన్ మిఠాయి) పై నిషేధం విధిస్తున్న రాష్ట్రాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గులాబీ రంగులో ఉండే ఈ పీచు మిఠాయిలో కృత్రిమ హానికారక రసాయన పదార్థాలు ఉన్నాయన్న కారణంతో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాయి.
దీనిపై కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు మాట్లాడుతూ...ఫుడ్ కలర్ వాడే వంటకాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ఇందులో తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా చేరింది. పీచు మిఠాయి ( కాటన్ మిఠాయి ) అమ్మకాలపై కొరడా ఝళిపించింది. అంతేకాదు, ఫుడ్ కలర్ వాడిన మంచూరియా( Gobi Manchurian ), పీచు మిఠాయి ( కాటన్ మిఠాయి ) పదార్థాల పైనా కర్ణాటక ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. రాష్ట్రంలో 171 రకాల వంటకాల శాంపిళ్లను అధికారులు పరిశీలించారని, అందులో 107 వంటకాల్లో ప్రమాదకర కృత్రిమ రంగులు వాడుతున్నట్టు గుర్తించారని వివరించారు. రోడమైన్-బి, టార్ట్రాజైన్ వంటి రసాయనాల వల్ల ఆహార పదార్థాలకు ఆకట్టుకునే కలర్ వస్తుందని, అయితే ఈ కృత్రిమ రంగులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని చెప్పారు. అందుకే వీటిపై కర్ణాటకలో నిషేధం విధించామని... ఫుడ్ కలర్ వాడిన మంచూరియా, పీచు మిఠాయి ఎవరైనా అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి దినేశ్ గుండూరావు స్పష్టం చేశారు.