డీఎస్సీ పరీక్ష 4 వారాలు వాయిదా...
డీఎస్సీ పరీక్ష 4 వారాలు వాయిదా...
విజయవాడ, మార్చి 04 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని పేర్కొంది. రాతపరీక్ష తరువాత 'కీ' పై అభ్యంతరాలు స్వీకరణకు సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డీఎస్సీ పరీక్షలను హడావుడిగా నిర్వహిస్తున్నట్లు కోర్టు అభిప్రాయపడింది. 2018లో జరిగిన టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య తగిన సమయం ఇచ్చారని ఉదాహరణగా పేర్కొంది. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), డీఎస్సీ పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా షెడ్యూల్ మార్చాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై గత బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పును రిజర్వ్ చేశారు.
టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం. పెద్దిరాజు, మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం నోటిఫికేషన్ రద్దుచేసి ఈ పరీక్షల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టెట్ ముగిసిన తర్వాత డీఎస్సీ పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేదని,దీని కారణంగా అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు.