Story#ఇది నిజం...నేటి సమాజంలో..!
ఇది నిజం..నేటి సమాజంలో..!
క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది. పిల్లలకి బడిలో భయంలేదు, ఇంట్లో భయం లేదు, అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు. గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు, ఇక చదువు సంస్కారం ఎట్లా వస్తుంది కొట్టొద్దు! తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు! 5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే వస్తే రానియ్ అనే పరిస్తితి. దరిద్రం ఏంటంటే కొంతమంది తల్లి దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు. పెన్ను ఉంటే పుస్తకం ఉండదు పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు తెచ్చుకోరు. భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది. కొట్టకుండా తిట్టకుండా భయం లేకుండా చదువు వస్తుందా...?
భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!
అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం
స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు తిట్ట కూడదు కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట. ఇదెలా సాధ్యమ్...?
మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటిది తప్పేకదా అని ఊరుకుంటుందా..?
మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.
తల్లిదండ్రులకు మనవి
పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు 90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. ఇది యదార్ధం. ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.
ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలి. తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..
పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, సోషల్ మీడియా
పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం మూఢ నమ్మకాలు స్వార్థం అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.
అభినయాలు కనపడడం లేదు అణకువగా ఉండటం రాదు సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లి దండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు.
రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?
కేవలం గుడికి, దర్గా లకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు. సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..
పిల్లలకు..బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక ద్రృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు, దైవ భక్తి, దేశ భక్తి, కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి.
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందుతుంది.భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.
బీరవేళ్లీ అవినాష్
ఏంఎ, ఏంసిజే(జర్నలిజం)
జర్నలిస్ట్..✍️