ఈసారి "కౌంట్ డౌన్ మనదే... టైమింగ్ మనదే... రాకెట్ మనదే..."
ఈసారి "కౌంట్ డౌన్ మనదే... టైమింగ్ మనదే... రాకెట్ మనదే..."
భారత వ్యోమగాములు అంతరిక్షంలోకి అడుగుపెట్టే చారిత్రక ఘట్టానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో గగన్ యాన్ వ్యోమగాములను ఇస్రో ప్రపంచం ముందుంచింది. గగన్ యాన్ కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల బృందాన్ని ప్రకటించింది. గగన్ యాన్ ప్రాజెక్ట్ పురోగతిపై ప్రధాని మోదీ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఉన్నారు. వీరంతా వేరేవేరే ఇస్రో కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. ఈ నలుగురు వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వ్యోమగాములు నలుగురు వ్యక్తులు కాదని 140 కోట్ల మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలు రోదసీలోకి మోసుకెళ్లే నాలుగు శక్తులని. ఈసారి "కౌంట్ డౌన్ మనదే... టైమింగ్ మనదే... రాకెట్ మనదే..." అని కొనియాడారు.
వారి గురించి తెలుసుకుందాం...
గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్
1976 లో కేరళలో జన్మించారు. 1998లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఎంపికయ్యారు. యుద్ధ విమానాలను 3 వేల గంటలు నడిపిన అనుభవం ఉంది. మిగ్-21, మిగ్-29, హాక్, డార్నియర్, ఏఎన్-32, SU-30 MKI లను నడిపారు.
గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్
చెన్నైలో 1982లో జన్మించారు. 2003లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఎంపికయ్యారు. యుధ్ధ విమానాలను 2900 గంటల అనుభవం ఉంది. SU-30 MKI, మిగ్-21, మిగ్-29, హాక్, డార్నియర్, ఏఎన్-32 లను నడిపారు.
గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్
42 ఏళ్ల అంగత్ ప్రతాప్ ఉత్తరప్రదేశ్లో జన్మించారు. 2004లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఎంపికయ్యారు. విమానాలను 2000 గంటలు నడిపిన అనుభవం ఉంది. మిగ్-21, మిగ్-29, హాక్, డార్నియర్, ఏఎన్-32, జాగ్వర్, SU-30 MKI లను నడిపారు.
వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో 1985లో జన్మించారు. 2006లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఎంపికయ్యారు. విమానాలను రెండు వేల గంటలు నడిపిన అనుభవం ఉంది.SU-30 MKI, మిగ్-21, మిగ్-29, హాక్, డార్నియర్, ఏఎన్-32 లను నడిపారు.
అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా 40ఏళ్ల క్రితం 1984లో రాకేశ్ శర్మ చరిత్ర సృష్టించారు. అయితే, రష్యారాకెట్ లో ఆయన అంతరిక్షంలోకి వెళ్లాడు. ఇప్పుడు నలుగురు భారతీయులు మనదేశం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరే రాకెట్లో ప్రయాణించి అంతరిక్షంలో అడుగు పెట్టనున్నారు. ఈ నలుగురు వ్యోమగాములు భారతదేశంలోని అన్ని రకాల యుద్ధ విమానాలను నడిపారు. అందువల్ల, యుద్ధ విమానాల లోపాలు, ప్రత్యేకతలు వీరు అవపోసన పట్టారు. వీరంతా రష్యాలోని జియోగ్నీ నగరంలో ఉన్న రష్యన్ స్పేస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందారు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ తీసుకుంటున్నారు.
సెలక్షన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) గగన్ యాన్ మిషన్ కోసం వ్యోమగాములను ఎంపిక చేయడానికి ట్రయల్స్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా వందలాది మంది పైలట్లు ఇందులో అర్హత సాధించారు. వీరిలో టాప్ 12 మంది ఎంపికయ్యారు. అనేక రకాల రౌండ్ల తరువాత ఈ మిషన్ కోసం నలుగురు ఎయిర్ ఫోర్స్ పైలట్లను ఎంపిక చేశారు. వీరి శిక్షణ 2021లో పూర్తయింది. ఈ పైలట్లు రష్యాలో అనేక రకాల శిక్షణలు తీసుకున్నారు. ప్రస్తుతం వీరు బెంగళూరులో ఉన్న ఇస్రో హ్యూమన్ స్పేస్ సెంటర్ (హెచ్ఎస్ఎఫ్సి)లో సాధన చేస్తున్నారు. ఫిట్నెస్పై కూడా శ్రద్ధ చూపుతున్నారు. అయితే, గగన్ యాన్ మిషన్ ను అంతరిక్షంలోకి ప్రయోగించే సమయంలో ముగ్గురు వ్యోమగాములను మాత్రమే పంపించనున్నారు.
గగన్ యాన్ మిషన్ 2025లో జరగనుంది. ఇందులో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. దీనికోసం LVM-MARK3 రాకెట్ ను పయోగించనున్నారు. దాదాపు మూడు రోజుల తర్వాత భూమికి తిరిగి వస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమ నౌక సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. ఈ మిషన్ భారతదేశానికి చాలా ముఖ్యమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే అమెరికా, చైనా, రష్యా తరువాత మానవ సహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా నిర్వహించిన నాల్గో దేశంగా భారత్ అవతరిస్తుంది.