పీచు మిఠాయి నిషేధంపై ఫోకస్.. శాంపిల్స్ సేకరించిన ఏపీ ప్రభుత్వం
పీచు మిఠాయి నిషేధంపై ఫోకస్..శాంపిల్స్ సేకరించిన ఏపీ ప్రభుత్వం
విజయవాడ/అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
సాధారణంగా చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా పీచుమిఠాయిని చూస్తేనే నోరూరుతుంది. అయితే వీటిని తినడం వల్ల పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుందంటూ గతవారం రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవలే తమిళనాడు, పుదుచ్చేరిలో వారి శాంపిల్స్ లో హానికరమైన కెమికల్స్ ఉండటం వల్ల పీచు మిఠాయిని (కాటన్ మిఠాయి) నిషేధం విధించారు. తాజగా పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఆరోగ్య, రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ... పీచుమిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు చేస్తున్నారని, ఇది క్యాన్సర్ కారకమని తెలిపారు. రోడమైన్-బీ, మెటానిల్-ఎల్లో వంటి రంగులు ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పారు. నమూనాల సేకరణ, పరీక్షల ప్రక్రియలకు నెల రోజుల సమయం పట్టొచ్చని అన్నారు. కృత్రిమ రంగు లేని పీచుమిఠాయిలను తినడం కూడా సరైనది కాదని.. అపరిశుభ్ర పరిస్థితుల్లో వీటిని తయారు చేస్తారని చెప్పారు. ప్రస్తుతం పండుగలు, జాతరలు ఉండటంతో వీటి అమ్మకాలు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఈ మధ్యకాలంలో బెల్లం, మిర్చి, పాల ఉత్పత్తులపై కూడా నిఘా పెంచినట్లు నివాస్ తెలిపారు. చాలా చోట్ల శాంపిల్స్ సేకరించామని నెల రోజుల్లో రిపోర్టులు వస్తాయని చెప్పారు. పాఠశాలలో విక్రయించే ఉత్పత్తులపై ఎక్స్పైరీ డేట్ సరి చూసుకోవాలని తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటివి తెలియజేయాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్ టెస్టింగ్ ఆధారంగా ఏపీలో పీచ్ మిఠాయి నిషేధంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.